శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్నగర్ డివిజన్లోని ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఆదివారం ఉత్సాహభరితంగా నిర్వహించారు. స్నేహబంధాల విలువను చాటిచెప్పేలా సభ్యులంతా ఒకేచోట చేరి ఆత్మీయంగా వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం అనేది జీవితాంతం నిలిచే అపురూపమైన బంధమని, కష్టసుఖాల్లో అండగా నిలిచే నిజమైన స్నేహితులే మనిషికి అసలైన ఆస్తి అని పలువురు సభ్యులు పేర్కొన్నారు.

ఇలాంటి ఆత్మీయ సమావేశాలు పరస్పర విశ్వాసాన్ని, అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు సమాజంలో ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ స్నేహానికి ప్రతీకగా ఆనంద క్షణాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు యాదవ్, అజయ్ చింతల, చంద్రశేఖర్, కేశవరావు, సాయి, నరేష్, నరహరి, రమేష్, నాగరాజు యాదవ్, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.





