శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. మియాపూర్ లోని మక్తా మహబూబ్ పేటలో హైడ్రా అధికారులు, సిబ్బంది శనివారం ఆక్రమణలను తొలగించారు. సర్వే నంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడారు. ఇదే సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రాకు గతంలోనే కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు గతంలోనే 5 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200 మీటర్ల మేర వేసిన 18 షటర్లను హైడ్రా గతంలోనే తొలగించింది.

తాజాగా మక్తా మహబూబ్ పేటలోని సర్వే నంబరు 44లోని ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ర్టేషన్లతోపాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో మరోసారి హైడ్రా విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో అక్కడి 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు హైడ్రా నిర్ధారించగా, 159 సర్వే నంబర్లోని భూమి పత్రాలతో సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకూ కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.






